హైదరాబాద్ : ఎస్సీ గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహూల్ బొజ్జ, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, సంయుక్త, ఉప, సహాయ కార్యదర్శులు, జోనల్, రీజినల్, జిల్లా కో-ఆర్దనేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సదాశయంతో సీఎం కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన, సంకల్పానికి అనుగుణంగా వీటిని మరింత గొప్పగా నిర్వహించడం, ఫలితాలు సాధించేందుకు మనమందరం బాధ్యతాయుతంగా ముందుకు సాగుదామన్నారు.
ఇందుకు గాను అధికారులు పాఠశాలలను తరచూ సందర్శించాలని, హాజరు, తరగతుల నిర్వహణ, పరీక్షలు, ఫలితాలు, విజయాలపై మాత్రమే దృష్టి సారించాలని మంత్రి ఈశ్వర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ గురుకులాల నిర్వహణ, పురోగతి, సాధించిన ఫలితాలు, విజయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నర్సింగ్, ఇంజినీరింగ్, బాలుర కోసం 15 డిగ్రీ కాలేజీల ఏర్పాటు ప్రతిపాదన గురించి తెలుపగా.. మంత్రి కొప్పుల వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. వివిధ పోటీ పరీక్షలు, క్రీడలు అత్యుత్తమ ఫలితాలు సాధించిన, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించే సభను త్వరలో ఘనంగా జరుపుకుందామని మంత్రి ఈశ్వర్ చెప్పారు.