హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి రోజు సమావేశాలకు ఏఐఎఫ్టీవో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్వినీకుమార్ అధ్యక్షత వహించారు.
16 రాష్ర్టాల నుంచి 25 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ అభివృద్ధిలో పురోగమిస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బీమా వంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకులాలను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ప్రతి 600 మందికి ఒక వైద్యుడు అందుబాటులోకి వస్తారని వెల్లడించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు కోసం దేశ వ్యాప్త ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అశ్వినీకుమార్ చెప్పారు. సమావేశంలో ఏఐఎఫ్టీవో ప్రధాన కార్యదర్శి చగన్లాల్ రోజ్, జాతీయ ఉపాధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, జీ వెంకట్రెడ్డి, రష్మీసింగ్, శిల్పానాయక్, సలావుద్దీన్, గీత పాల్గొన్నారు.