Gurukula Societies | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు, గురుకుల సొసైటీలు పరస్పర విరుద్ధ మార్గాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుత వేసవిలో ఇంటర్ తరగతులు, అడ్మిషన్లను నిర్వహించవద్దని, 2024-25 విద్యా సంవత్సరానికి తరగతులను జూన్ 1 నుంచే ప్రారంభించాలని ఇటీవల బోర్డు జారీ చేసిన ఆదేశాలను గురుకుల సొసైటీలు తుంగలో తొక్కుతున్నాయి. బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తుండటంతోపాటు అడ్మిషన్లను కూడా చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్ పరీక్షలు గత నెల 14న ముగియడంతో మే చివరిదాకా బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ముగిశాకే ఇంటర్ కాలేజీలను పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. కానీ, గురుకుల సొసైటీల్లో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు (సీవోఈ) ఉన్నాయి. వాటిలో చదివే విద్యార్థులకు ఇంటర్ విద్యతోపాటు సమాంతరంగా జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తున్నారు. దీన్ని సాకుగా చూపుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీలు ఇప్పటికీ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసుకున్న విద్యార్థులకు మే 15 వరకు తరగతులు కొనసాగించాలని సంబంధిత ఆర్సీవోలు, కాలేజీ ప్రిన్సిపాళ్లకు గురుకుల సొసైటీ ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సీవోఈల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇటీవల ప్రకటించిన సొషల్ వెల్ఫేర్ సొసైటీ.. ఇంటర్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నది.
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇటీవల పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయినప్పటికీ సొసైటీ తన తీరును మార్చుకోకపోవడం, ఇంటర్ విద్యార్థులకు విశ్రాంతి ఇవ్వకుండా తరగతులను కొనసాగిస్తుండడంపై ఉపాధ్యాయ సంఘాలే విమర్శలు గుప్పిస్తున్నాయి. సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యం జేఈఈ, నీట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలంటే ఇంటర్ సిలబస్ను అక్టోబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉంటుందని గురుకుల సొసైటీ అధికారులు వాదిస్తున్నారు. అప్పుడే ఆయా ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశముంటుందని అంటున్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీవోఈల్లో వేసవిలోనూ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు.