Telangana | తెలంగాణలో అనతికాలంలో విద్యా విప్లవాన్ని సృష్టించిన బీఆర్ఎస్.. అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకొన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలలాగే వారికీ ఉచిత నాణ్యమైన విద్యనందేలా కేసీఆర్ గొప్ప ఆలోచన చేశారు. తెలంగాణలో అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం 119 గురుకులాలను ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టి, అన్ని వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు చుక్కానిలా నిలుస్తామని చాటిచెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ సర్కారు విశేష కృషి చేస్తున్నది. పలు ప్రతిష్ఠాత్మక కంపెనీలతో ఒప్పందాలు చేసుకొంటూ గురుకుల విద్యార్థులకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే పై చదువులకు అనుగుణంగా వివిధ పోటీపరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు.
కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మాస్ మ్యూచువల్స్ ఇండియావంటి ప్రముఖ సంస్థలు గురుకులాలకే వచ్చి ప్రాంగణ నియామకాలను చేపడతున్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 1000 మందికిపైగా విద్యార్థినులు నేరుగా డిగ్రీ పట్టా చేతికి వచ్చిరాగానే లక్షల ప్యాకేజీతో కొలువుల్లో చేరడం తెలంగాణ గురుకుల విద్యకు గర్వకారణం. గురుకులాలు అందిస్తున్న అవకాశాలతో అట్టడుగువర్గాల విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకుంటూ.. ఉన్నత ఉద్యోగాలను పొందుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
పేదింటి బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు
అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాఫూలే మహనీయులు చూపిన మార్గంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్యావిధానం యావత్తు దేశానికే నేడు దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల మాదిరిగానే ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం విద్యారంగంలోనూ తీవ్ర వివక్షకు గురైంది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో తెలంగాణ విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని సంకల్పించారు.
తొమ్మిదిన్నరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆ దిశగా వడివడిగా బలమైన అడుగులు పడుతున్నాయి. స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి క్రమక్రమంగా గురుకులాల సంఖ్యను విస్తరిస్తూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం 293 గురుకులాలు మాత్రమే ఉండగా, అందులోనూ 5-10వ తరగతి వరకు మాత్రమే విద్యనందించేవారు. ఇంటర్, డిగ్రీ గురుకుల కళాశాలల ఊసే లేదే లేదు. కేవలం పోస్ట్మెట్రిక్ హాస్టల్ను నిర్వహించగా అవి కూడా అంతంతమాత్రమే. ఆయా గురుకులాల్లో వసతులూ నామమాత్రమే. హాస్టళ్లు ఉన్నా విద్యార్థులు లేక అవి బోసిపోయే దుస్థితి. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేశారు.
అగ్రవర్ణ పేదలకోసం సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం 2016-17 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారీగా గురుకుల పాఠశాలలను క్రమానుగుతంగా విస్తరించుకుంటూ వస్తున్నది. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున నెలకొల్పింది. ఆ తర్వాత 2017-18లో, 2019లోనూ మరోసారి హాస్టళ్ల సంఖ్యను పెంచింది. మొత్తంగా గతంలో ఉన్న గురుకులాలతో కలిపి రెసిడెన్షియల్ గురుకులాల సంఖ్యను 1022కు తీసుకొచ్చింది. అట్టడుగు వర్గాల విద్యాభ్యున్నతికి బాటలు వేసింది. విద్యార్థులకు ఉచితంగా సన్నబియ్యంతో భోజనంతోపాటు మెరుగైన శిక్షణను అందిస్తున్నది. ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలను ఖర్చు చేస్తున్నది.
సగటును ఒక్కో గురుకులం ద్వారా 640 మంది చొప్పున ఏటా ఇప్పటికే 6.50 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది. అట్టడుగు వర్గాల బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. రాబోయే రోజుల్లో అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థుల కోసం 119 గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. మైనార్టీ విద్యార్థులకు సైతం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గురుకుల విద్యలో తెలంగాణ ప్రభుత్వం బాలికలకు పెద్దపీట వేస్తున్నది. మొత్తం గురుకులాల్లో 564 గురుకులాలు బాలికలవే కావడం అందుకు నిదర్శనం. మొత్తంగా ఉమ్మడి పాలనలో ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా అందుబాటులో లేకపోగా, నేడు 85 కళాశాలలను తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసింది. అందులోనూ బాలికలకే తొలి ప్రాధాన్యమిచ్చింది.
ప్రత్యేక గురుకుల కళాశాలలు
తెలంగాణ ప్రభుత్వం బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఎస్సీ(బీజడ్సీ), బీకాం, బీఏ కోర్సులు అందించేలా సాధారణ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక వృత్తివిద్య గురుకులాలను సైతం నెలకొల్పుతున్నది. డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురుకులాల్లో కొన్నింటిని ఎక్స్లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కలిపి మొత్తంగా 50కి పైగా సెంటర్లు ఏర్పాటు చేసింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఐఐటీ, జేఈఈ, నీట్తోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో తర్ఫీదునిస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశివేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు.
ప్రత్యేక గురుకులాలు
సైనిక్ స్కూల్-రుక్మాపూర్
ఆర్మ్డ్ ఫోర్స్ కాలేజీ-భువనగిరి
బీఏ(హానర్స్)-వికారాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ
హోటల్ మేనేజ్మెంట్-సంగారెడ్డి కాలేజీ
రెసిడెన్షియల్ లా కాలేజీ-కందుకూరు
అగ్రికల్చర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ- కరీంనగర్, వనపర్తి
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులు
తెలంగాణ సర్కారు గురుకులాల్లో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా, సత్వరమే ఉపాధి అవకాశాల పొందగల కోర్సులను ప్రవేశపెడుతుండటం విశేషం. గురుకుల కళాశాలల్లో నూతన సాంకేతిక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంటర్మీడియట్ స్థాయిలో..
ఒకేషనల్లో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులకు శ్రీకారం చుట్టింది.
డిగ్రీ కళాశాలల్లో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్, బీబీఏ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియాలజి, బిజినెస్ అనలిటిక్స్, జియోగ్రఫీ, డాటా సైన్స్, సోషియాలజి, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ గురుకులాల ద్వారా సాధిస్తున్న సత్ఫలితాలివే..
తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటా
మాది మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామం. నాన్న ధర్మారం నాగయ్య ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. అమ్మ మహేశ్వరి గృహిణి. 3 నుంచి 10వ తరగతి వరకు చర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశా. ఆ తర్వాత నెక్కొండలోని టీఎస్ ఆర్జేసీలో ఇంటర్ పూర్తి చేశా. ఇంజినీర్ కావాలనేది నా చిన్ననాటి కల. గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో లాంగ్టర్మ్ కొచింగ్లో చేరడం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. కార్పొరేట్స్థాయి శిక్షణ ఇచ్చారు. అందువల్లే జేఈఈ అడ్వాన్స్లో 4,651 ర్యాంకు సాధించా. ఐఐటీ మండిలో ప్రస్తుతం కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్న. నన్ను అన్నివిధాలా ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– వాణిశ్రీ, ఐఐటీ మండి
గురుకులంలో అందించిన కోచింగ్ వల్లే
మాది కామారెడ్డి జిల్లా జుక్కల్. నాన్న రాములు, అమ్మ ముక్త. మాది సాధారణ కుటుంబమే. తెలంగాణ ప్రభు త్వం ఏర్పాటు చేసి న గౌలిదొడ్డి కాలేజీలో కోచింగ్ తీసుకు న్న. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఎంతో మెరుగైన శిక్షణ ఇచ్చారు. ఎంసెట్లో 3000 ర్యాంకు వచ్చింది. ‘గాంధీ’లో ఇటీవలే మెడిసిన్ పూర్తిచేశా. ప్రస్తుతం ముంబైలోని జగ్జీవన్రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్లో పీజీ సీటు వచ్చింది. పీడియాట్రిషియన్ కావాలన్నదని నా కోరిక. డాక్టర్ కావాలన్న నా ఆశయాన్ని గౌలిదొడ్డి కళాశాల తీర్చింది. సీఎం కేసీఆర్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– గణేష్, ముంబై, జగ్జీవన్రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్
మరో నెలలో డాక్టర్ పట్టా చేతికి
మాది హైదరాబాద్లోని తార్నాక. డాక్టర్ కావాలన్నది నా కల. ఇంటర్ పూర్తయ్యే సమయానికి నాన్న కోటేశ్వర్రావు అనారోగ్యం తో కన్నుమూశారు. ఒక్కసారిగా నా కలలన్నీ తలకిందులయ్యాయి. అదే సమయంలో 2015లో ప్రభుత్వం గౌలిదొడ్డి గురుకుల విద్యాలయంలో నీట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. మొట్టమొదటి బ్యాచ్లోనే చేరా. అక్కడి శిక్షణతో నీట్లో 2000, ఎంసెట్లో 5000 ర్యాంకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని భాస్కర్ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్నా. అమ్మ కమల, సోదరుడు సాయిచందర్ సహకారంతో ఎంబీబీఎస్ పూర్తి చేశా. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
– డాక్టర్ సంధ్య, తార్నాక (భాస్కర్ మెడికల్ కాలేజీ)