త్వరలో రెట్టింపు కానున్న గురుకులాలు
ఈ ఏడాది నుంచే 33 కొత్త స్కూళ్లు.. 15 డిగ్రీ కాలేజీలు.. 21 స్టడీ సర్కిళ్లు
సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ బీసీలకు విద్యా ప్రదాతగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటుచేస్తూ మొత్తంగా ప్రస్తుతమున్న 281 గురుకులాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. అందుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి ఉన్నతాధికారులతో ఖైరతాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ గురుకులాలు ఉన్నాయి. అందులో 143 పాఠశాలలు, 119 పాఠశాలలతోపాటు జూనియర్ కాలేజీలు, 19 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ పనిచేస్తున్నాయి. వీటిల్లో మొత్తం 1,52,440 మంది విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నది. వాటికి అదనంగా ఈ ఏడాది నుంచే జిల్లా యూనిట్గా మరో 33 గురుకులాలను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వాటి ద్వారా మరో 7,920 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది’ అని వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 4 సూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం మరో 115 సూళ్లను అప్గ్రేడ్ చేస్తాం. తద్వారా 15,600 విద్యార్థులు అదనంగా ఇంటర్ విద్య అందనున్నది’ అని తెలిపారు.
ఇండస్ట్రీ లింకింగ్ కోర్సులు
ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి గంగుల తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిధ్యంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఆదేశించారు. ఇండస్ట్రీ అవసరాల మేరకు కోర్సులను రూపొందించాలని సూచించారు. గురుకులాలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిల్వ ఉన్న బియ్యాన్ని ఇచ్చి మంచి బియ్యం తీసుకోవాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ఏక సంఘంగా ఏర్పడిన ఆరు కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల మంజూరు పత్రాలను 8వ తేదీన అందిస్తామని వెల్లడించారు. బీసీల అభ్యున్నతకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్కు బీసీ విద్యార్థులు, కుల సంఘాల తరపున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.