హైదరాబాద్: తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు (Gurukul Aspirants) మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న గురుకుల అభ్యర్థులు.. బోర్డు చేసిన తప్పులను తమపై రుద్దొద్దని, తమకు న్యాయం చేయాలని కోరారు. సరైన పద్దతిలో నియామక ప్రక్రియ జరుగకపోవడంతోనే ఒక్కొక్కరికి మూడు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తద్వారా చాలా మంది నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాము కూడా కోర్టుకు వెళ్లామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఇన్నాళ్లు ఎన్నికల కోడ్ అని సాగదీశారని, ఇప్పుడు స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నాయని తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ నిరసన వ్యక్తంచేశారు.