నార్కట్పల్లి, ఆగస్టు 4 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ సమీపంలో గురువారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి గతంలో డోజర్ వాహనాన్ని నడిపేవాడు. అందులో నష్టం రావడంతో దాదాపు ఏడాది నుంచి మునుగోడు మండల కేంద్రంలో వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం రోజూ ఉదయాన్నే మునుగోడుకు వెళ్లి రాత్రి ఇంటికి వస్తుంటాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి మునుగోడు నుంచి బ్రాహ్మణవెల్లెంలకు వస్తుండగా.. మార్గమధ్యంలో ఊకొండి క్రాస్రోడ్డు వద్ద వెనుక నుంచి బుల్లెట్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శబ్దానికి సమీపంలోని ఇంట్లోని వారు బయటకు రావడంతో దుండగులు పరారయ్యారు. మూడు రౌండ్లు కాల్పులు జరుపగా నిమ్మల స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సర్పంచ్ వెంటనే అతడిని ఆటోలో నార్కట్పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. పోలీసులు దవాఖానకు వెళ్లి స్వామితో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. తనకు ఎవరితోనూ గొడవలు లేవని బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.