ఖైరతాబాద్, మార్చి 19: ఫిషరీస్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వేరే సామాజికవర్గానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
ఇప్పటికైనా ఫిషరీస్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ముదిరాజ్లకే కేటాయించాలి’ అని కోరారు. 2009 ఫిబ్రవరి 19న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ముదిరాజ్లను బీసీ (డీ) నుంచి బీసీ (ఏ)లోకి మార్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ ఎంపీ సీటును నీలం మధుకు కేటాయించాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ అల్లుడు జగన్ ముదిరాజ్, సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రంజిత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.