కమాన్పూర్, మార్చి 11 : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల కల్పతరువు అయిన ఈ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో మట్టి గడ్డలు తేలుతున్నాయి. ఎస్సారెస్పీకి అనుబంధంగా గుండారం గ్రామంలో నిర్మించగా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు కూడా అనుసంధానంగా ఏటా రెండు టీఎంసీలు తరలించేందుకు పైప్లైన్ను ఏర్పాటు చేశారు. దీంతో ఒకవైపు ఎస్ఆర్ఎస్పీ నుంచి, మరో వైపు ఎల్లంపల్లి నుంచి రిజర్వాయర్కు సాగు నీరు సరఫరా చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే, ఏప్రిల్ 15 వరకు వారబంధీ పద్ధతిలో ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా సరిగా రావడంలేదు. ఇటు ఎల్లంపల్లి నుంచి కూడా నీటిని ఎత్తిపోయడం లేదు. దీంతో దిగువన ఉన్న చెరువులు, కుంటలు నింపలేని పరిస్థితి ఏర్పడగా, ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంతో ఈ రిజర్వాయర్ కూడా వట్టిపోయే పరిస్థితి నెలకొన్నది. రిజర్వాయర్ సామర్థ్యం 0.08 టీఎంసీలు కాగా, 12 అడుగుల ఎత్తు ఉన్నది. ఇందులో 8 ఫీట్ల ఎత్తు వరకు నీటి నిల్వలు ఉంటేనే దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయొచ్చు. అయితే, ప్రస్తుతం గేట్లు ఎత్తినా నీళ్లు బయటి వెళ్లలేని పరిస్థితికి చేరుకున్నది. అధికారికంగా 28,800 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా నీటిని అందించలేని పరిస్థితి నెలకొన్నది.