హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)/డిచ్పల్లి/సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 24: సాహితీవేత్త, విమర్శకుడు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పడుతూ ‘ఆత్మకథల్లో అలనాటి తెలంగాణ’, ‘తెలంగాణం తెలుగు మాగాణం’ తదితర పరిశోధనా గ్రంథాలతోపాటు ప్రసిద్ధిపేట పేరుతో సిద్దిపేట చరిత్రను ఆయన రచించారు. ఆయన మరణవార్త తెలియడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తదితరులు హైదరాబాద్ సుచిత్రలోని బాలశ్రీనివాసమూర్తి స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనివర్సిటీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాలశ్రీనివాసమూర్తి మృతి పట్ల పలువురు కవులు, రచయితలు సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు కే రంగాచారి, ప్రముఖ కవి అంజయ్య, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నాల బాలయ్య, తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు నందిని భగవాన్రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తంచేశారు. సోమవారం సాయంత్రం సుచిత్ర సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.