Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మల్యాల గ్రామానికి చెందిన పడిగెల నరేశ్(25) ఉపాధి నిమిత్తం ఐదేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. పది రోజుల క్రితమే అతను సొంతూరికి తిరిగొచ్చాడు. బుధవారం అర్ధరాత్రి నరేశ్పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే నరేశ్ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నరేశ్ తన ఇంటికి సమీపంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆమె భర్తే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.