సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మహబూబ్నగర్ మహిళా స్వయం సహాయక సంఘాలు గతేడాది విత్తనబంతులతో అతిపెద్ద వాక్యాన్ని రాసి, గిన్నిస్లో చోటుసంపాదించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్ఫూర్తితో మహబూబ్నగర్జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పది రోజుల్లో 2కోట్ల 8 లక్షల 24వేల విత్తన బంతులను తయారుచేశారు. కాగా, ఇందులో భాగస్వాములైనవారికి హైదరాబాద్లోని బేగంపేటలోగల టూరిజం ప్లాజా హోటల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పంపిన సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మహబూబ్నగర్ జిల్లా స్వయం సహాయక సంఘాలు సాధించిన గిన్నిస్ రికార్డును గ్రీన్ ఇండియా చాలెంజ్కు అంకితమిచ్చారు.
ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ (2,087 ఎకరాలు)ను చేపట్టి శ్రీనివాస్గౌడ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గిన్నిస్ రికార్డును గ్రీన్ ఇండియా చాలెంజ్కు అంకితం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మినీ జూ ఏర్పాటు చేసేందుకు తన నిధుల నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ సంతోష్కుమార్ ప్రకటించారు. జిల్లా మహిళా సంఘాలు 2023 లో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హరితహారం సంకల్పాన్ని నెరవేర్చేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గతేడాది 2 కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను మహిళా సంఘాలతో తయారుచేయించి, విసిరామని చప్పారు. అలాగే, ఆ విత్తన బంతులతో రూపొందించిన అతిపెద్ద వాక్యానికి గిన్నిస్లో చోటు లభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావు, డీఆర్డీవో యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.