చేర్యాల, ఏప్రిల్ 11: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిత్యావసర సరుకుల కొనుగోలు, టెండర్లలో అక్రమాలు జరుగుతుండటంపై 8-4-2024 (సోమవారం)న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి దేవాదాయ శాఖ స్పందించింది. ఈ మేరకు కొండగట్టు ఆంజనేయస్వామి, బాసర జ్ఞానసరస్వతి, కొమురవెల్లి మల్లన్న, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాల ఈవోలతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో ఇప్పటివరకు జరిగిన కొనుగోలు టెండర్లు, నిత్యావసర సరుకుల పంపిణీ అంశాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఆలయాల స్టోర్ రూమ్లలో ఉన్న స్టాక్ వివరాలను సేకరించారు. ఆయా ఆలయాల ఈవోలు.. స్టాక్, కొనుగోలు, చెల్లింపులు తదితర వాటిపై నివేదికలను కమిషనర్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో జరుగుతున్న నిత్యావసర సరుకుల కొనుగోళ్ల కోసం టెండర్లలో నూతన విధానం తీసుకొచ్చేందుకు ఆయా ఆలయాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సంబంధించి 2024-25 నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం నిర్వహించిన టెండర్లను దేవాదాయ శాఖ కమిషనర్ ఖరారు చేయలేదు. నూతన విధానం అమలులోకి వచ్చిన అనంతరం అదే టెండర్లను ఖరారు చేయాలా? తిరిగి టెండర్లు నిర్వహించాలా? అనే దానిపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.