హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పీరియడ్కు రూ.300 చొప్పున పారితోషికం ఇస్తుండగా, తాజాగా పీరియడ్కు రూ.390కి పెంచుతూ గురువారం ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్రోస్ జీవో-1105 ని విడుదల చేశారు. వీరు నెలకు 72 గంటలపాటు పనిచేసేలా, పారితోషికం రూ.28,080 మించరాదని సీలింగ్ విధించారు. దీంతో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెండువేల మంది గెస్ట్ లెక్చరర్లకు ప్రయోజనకం కలగనున్నది.
తెలంగాణ రాకముందు పీరియడ్కు రూ.150 మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం 2017లో పీరియడ్కు రూ.300కు పెంచింది. తాజాగా పీఆర్సీ ప్రకారం రూ.390 కి పెంచింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసొసియేషన్(2151) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు కోడి మహేశ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎం బాబురావు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు సహకరించిన మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.