ఆదిలాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు చెప్పడం.. ఆపై దొంగ ప్రమాణాలు చేయడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్లో పలచన అవుతున్నాడు. నిర్మల్ జిల్లాలో యాత్రలో మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. భైంసా మండలం రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామం గుండెగాంలో సర్కారుపై నిందలు వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గుండెగాం గ్రామాన్ని అద్దంలా మెరిపిస్తామని చెబుతున్న బండి మాటలు నమ్మశక్యంగా లేవని, ఇప్పటివరకు తమ గ్రామానికి ఎంపీ సోయం బాపూరావు ఒక్కసారి కూడా రాలేదని పేర్కొన్నారు. నాలుగేండ్లలో బీజేపీ ఎంపీ గుండెగాం గ్రామానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ విషయం..
భైంసా మండలంలో రంగారావు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించి ముంపు గ్రామాల పునరావాసం కోసం రూ.62.78 కోట్లు విడుదల చేసింది. గుండెగాంలో 268 ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. బాధితులకు పరిహారం అందిస్తున్నారు. ఇటీవల ఆర్అండ్బీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గ్రామంలో ఇండ్ల సర్వే పూర్తి చేశారు. ప్రాజెక్టు బ్యాక్వాటర్తో ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచన మేరకు అధికారులు భైంసా సమీపంలోని సిద్ధుర్పాటలో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లల్లో నివాసం కల్పించారు. భారీ వర్షాల్లో ఇబ్బంది పడిన స్థానికులకు నిత్యావసరాలు, ఆర్థికసాయం అందజేశారు. తమను సర్కారు ఆదుకొన్నదని, పునరావాసానికి ఇండ్లు ఇచ్చారని గుండెగాం గ్రామస్థులు తెలిపారు. ప్రాజెక్టు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తమకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని స్థానికులు స్పష్టం చేశారు.
ఇండ్ల సర్వే పూర్తయ్యింది
గ్రామంలో 268 ఇండ్లు ఉండగా అధికారులు సర్వే పూర్తి చేశారు. పునరావాసం కోసం ప్రభుత్వం రూ.62.78 కోట్లు విడుదల చేసింది. త్వరలో సాయం అందనున్నది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. బీజేపీ ఎంపీ సోయం బాపురావు నాలుగేళ్ల నుంచి గుండెగాంకు ఎందుకు రాలేదో చెప్పాలి.
– సూర్యవంశీ చంద్రకాంత్, గుండెగాం, భైంసా మండలం