హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాల్సిందేనని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ అధినేత, రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనివాల్ డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీని తొలగించాలని రాష్ట్ర పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాసర్ ఢిల్లీలో ఎంపీని కలిసి మద్దతు కోరగా సానుకూలంగా స్పందించారు. జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేనేత మహావస్త్ర లేఖపై సంతకాలు చేశారు. చేనేతపై పన్నులను తొలగించాల్సిందిగా ప్రధాని, ఆర్థిక మంత్రులకు లేఖ రాస్తానని బేనివాల్ వెల్లడించారు.