హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఏ రంగంలోనైనా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశానికి దారిచూపే స్థితిలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సగటున 13 శాతం ఆర్థిక వృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర విభజన సమస్యలతోపాటు గత రెండేండ్లుగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధిరేటు తగ్గలేదని, గత ఏడేండ్లలో సగటున 13% వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వృద్ధి రేటు నమోదు కాలేదని గుర్తుచేశారు. ఈ లెక్కలు తాము చెప్పడంలేదని, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అధికారికంగా వెల్లడించినవేనని స్పష్టంచేశారు. ఈ విజయాలకు తాము చేపట్టిన త్రీ ఐ (ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇంక్లూజివ్ గ్రోత్)లు కారణమని వివరించారు. రాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా, 2021 నాటికి రూ.2.78 లక్షలకు (125%) పెరిగిందని తెలిపారు. 2014లో రాష్ట్రం జీఎస్డీపీ రూ.4.9 లక్షల కోట్లు ఉండగా, 2021 నాటికి రూ.11.54 లక్షల కోట్లకు (130%) చేరిందని వివరించారు. 2030 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 470 బిలియన్ డాలర్లకు (రూ.34 లక్షల కోట్లకు) చేరుతుందని తెలిపారు. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో బుధవారం నిర్వహించిన సీఐఐ తెలంగాణ చాప్టర్ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే అత్యుత్తమ స్టార్టప్గా నిలిచిందని తెలిపారు. ప్రపంచమే ప్రశంసించిన అత్యుత్తమ పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు.
విప్లవాత్మక సంస్కరణలు
దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.5 శాతం ఉంటే, జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతటి ప్రగతి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుచూపు, కచ్చితమైన కార్యాచరణ వల్లనే సాధ్యమైందని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ వల్ల రాష్ర్టానికి 19 వేల పరిశ్రమలు, రూ.2.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాదాపు 16 లక్షల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. టీఎస్ఐపాస్లాగే ఇండ్ల నిర్మాణానికి అనుమతుల జారీని సరళతరం చేసేందుకు టీఎస్బీపాస్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా 21 రోజుల్లో వాణిజ్య భవనాలకు అనుమతులు ఇస్తారని, లేదంటే 22వ రోజు అనుమతి వచ్చినట్టే భావించాల్సి ఉంటుందని తెలిపారు. 600 గజాల లోపు ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని మరికొన్ని కీలకాంశాలు.
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం మాత్రం ఉన్నది. విద్యుత్తు కొరత ఉండేది. ఇప్పుడు 16 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించాం. దేశంలో వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పరిశ్రమలకు కూడా 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ఇది తేలికగా రాలేదు. రాష్ట్రప్రభుత్వం దీనిపై ఎంతో ఖర్చుచేసింది.
రాష్ట్రంలో కోటి కుటుంబాలున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా వాళ్లందరికీ శుద్ధమైన నల్లా నీటిని అందిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రంలో 1.4 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేశాం. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.51,800 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పేరుతో అమలుచేస్తున్నది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నాలుగేండ్లలోపే పూర్తిచేశాం. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తునుంచి గోదావరి జలాలను ఏకంగా 612 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లాం. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సమ్మిళిత వృద్ధి (ఇంక్లూజివ్ గ్రోత్)లో భాగంగా 2013లో వ్యవసాయం రంగం ద్వారా జీఎస్డీపీకి 16 శాతం ఆదాయం వస్తే, 2021 నాటికి 21 శాతానికి చేరింది. భవిష్యత్తులో దేశంలో ఆహార కొరత, ధాన్యం సమస్య వస్తే ఆదుకోవటానికి తెలంగాణ సిద్ధంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తిలో పంజాబ్ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందని గర్వంగా చెప్పగలను. వ్యవసాయానికి నేరుగా పెట్టుబడి సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఆలోచించి రైతుబంధు పథకాన్ని తెచ్చారు. ఈ పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేలు రైతుకు నేరుగా అందిస్తున్నాం. రైతుకు నేరుగా పంట పెట్టుబడి సాయం అందించాలని గత 70 ఏండ్లలో కేసీఆర్ తప్ప ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధాని కూడా ఆలోచించలేదు. ఈ పథకం కింద 62 లక్షలమంది రైతులకు ఏటా రూ.15,000 కోట్లు అందిస్తున్నాం. దీనిని కేంద్రప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది.
గత ఏడేండ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 31.7 శాతానికి చేరింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇటీవల దేశంలోని అటవీశాఖ అధికారులంతా హైదరాబాద్లో నాతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనం పెంపులో దేశంలో తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్గా ఉన్నదని ముక్తకంఠంతో వెల్లడించారు.
రాష్ట్రంలో ఐటీకి సమానంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామిక విస్తరణ, అటవీ విస్తరణ ఏకకాలంలో జరుగుతున్నాయి. మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణ సమాంతరంగా సాగుతున్నాయి. సమ్మిళిత వృద్ధి అంటే ఇదే.
మెడికల్ హబ్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా అన్నారు. ఈ రాష్ట్రం నుంచే అనేక వ్యాధులకు వ్యాక్సిన్లు వచ్చాయని గుర్తుచేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి రాష్ట్రంలో అన్ని వసతులూ ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకోలేదని, యాజమాన్యాలపై ఒత్తిళ్లు తేలేదని చెప్పారు. దేశంలో ఆహార భద్రతకు అనుగుణంగా విధానాలు మార్చాలని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు.