‘తరగని బరువైనా.. వరమని అనుకుంటూ.. తనువును
మోసావె అమ్మా.. కడుపున కదలికనై.. కలవర పెడుతున్నా..
విరివిగ పంచావె ప్రేమా’.. అంటూ అమ్మ గొప్పదనం
గురించి చెప్తూనే ఆ అమ్మను కంటికి రెప్పలా
కాపాడుకుంటున్నాడో కొడుకు.
వరంగల్ నగరంలోని ఎంహెచ్నగర్ మురికివాడ. రామగిరి స్వరూప ఓ హోటల్లో పనిచేస్తున్నది. భర్త లేడు. ఒక్కడే కొడుకు. పేరు వాసు. అమ్మ కష్టం చూస్తూ పెరిగాడు. ఆమెను ఎక్కువగా కష్ట పెట్టొద్దు అనుకున్నాడు. పొద్దున లేవగానే అమ్మకు పనుల్లో సాయం చేస్తాడు. ఐదింటికల్లా సైకిల్ రెడీ చేసుకొని తల్లిని ఎంజీఎం సెంటర్లో ఉన్న హోటల్కు తీసుకెళ్తాడు. మళ్లీ ఇంటికొచ్చి తయారై హన్మకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్తాడు. స్కూల్ అయిపోయాక మల్లా అమ్మను హోటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్తాడు.
పోట్టకూటి కోసం సూర్యాపేట హోటల్లో పనికి కుదిరిన తండ్రి వెంకటేశ్వర్లు చెరువులో పడి మృతి చెందాడు. అప్పటినుంచి భారమంతా స్వరూపపైనే పడింది. కానీ, మగదిక్కు లేని సంసారం. చాలా ఇబ్బంది పడేది స్వరూప. తల్లి పడుతున్న కష్టం చూసి తల్లడిల్లాడు వాసు. బాగా చదువుకొని అమ్మను మహారాణిలా చూసుకోవాలని కలగన్నాడు. అప్పటి వరకూ చదువుకుంటూనే అమ్మకు అసరా కావాలని నిర్ణయించుకున్నాడు. స్వరూప హోటల్లో పనిచేస్తే రోజుకు రూ. 250 వస్తాయి. ఆటోకి వెళితే రూ.60 ఖర్చవుతాయి. నిరుపేద కుటుంబం. రోజూ రూ.60 కేవలం ఆటో కిరాయిలకే పెడితే ఎట్లా అనుకున్న వాసు తల్లిని పని వద్దకు తీసుకెళ్లడం, సాయంత్రం మల్లా ఇంటికి తీసుకు రావడం పనిగా పెట్టుకున్నాడు. వాసు అమ్మప్రేమను చూసి ఇరుగు పొరుగు మురిసి పోతుంటారు. ‘సెలవు రోజుల్లో ఐస్క్రీం అమ్మి ఇంట్లో టీవీ కొన్నా. అమ్మ నాకోసం కష్ట పడుతున్నప్పుడు నేను ఆమె కష్టాల్లో పాలు పంచుకుంటే తప్పేంది?’
అంటున్నాడు స్వరూప పుత్ర వాసు.