హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కరోనా తర్వాత చాలామంది పలురకాల చర్మవ్యాధులకు గురవుతున్నారని, ఆన్లైన్ క్లాస్లు, వర్క్ఫ్రమ్ హోమ్, ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే ఉండటమే కారణమని కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు, సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఒక ప్రైవేటు డెర్మటాలజీ క్లినిక్ను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా చాలామంది ఇండ్ల నుంచి బయటకు రాకపోవడం వల్ల వారు సూర్యరశ్మికి దూరమవుతున్నారని చెప్పారు. ఎక్కువసేపు ఏసీ గదుల్లో పనిచేసే వారు సైతం సూర్యరశ్మికి దూరమవడంతో చర్మ సమస్యలు పెరుగుతున్నట్టు వివరించారు. అంతేకాకుండా ఇండ్ల లో ఉండటం వల్ల నియంత్రణ లేని ఆహారం, అధికంగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో బ్లూలైట్కు ప్రభావితం కావడం వల్ల కూడా ఈ చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని, జుట్టు కూడా రాలిపోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు డెర్మటాలజీ వైద్య నిపుణులు పాల్గొన్నారు.