హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-4 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్పీఎస్సీకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ విడుదలపై గురువారం బీఆరే భవన్లో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డితోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్-4 క్యాడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని సీఎస్ సూచించారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించినట్ట చెప్పారు. మిగిలిన ఐదు శాతంలోనూ అత్యధిక పోస్టులు స్థానికులకే దకుతాయని తెలిపారు. ఇటీవల గ్రూప్-1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నదని, టెట్ నిర్వహణకు విద్యాశాఖకు క్లియరెన్స్ ఇచ్చిందని సోమేశ్కుమార్ పేర్కొన్నారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్
గ్రూప్-4 పోస్టుల ఖాళీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల వివరాలతోపాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అందజేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, ఇందుకోసం నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్లలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడిన జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.