హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 1న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అత్యధిక అభ్యర్థులు గ్రూప్-4 రాయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలతోపాటు కొన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా ఆన్లైన్లో సమావేశాలు నిర్వహించారు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద మహిళా అభ్యర్థులను తనిఖీ చేసేందుకు మహిళా అధికారులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సారి గ్రూప్-4లో థంబ్ అటెండెన్స్ తీసుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లోని కలెక్టరేట్లలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే వారిని శాశ్వతంగా కమిషన్ పరీక్షల నుంచి డిబార్ చేస్తామని టీఎస్పీఎస్సీ ఇప్పటికే హెచ్చరించిన విషయం విదితమే.
మొదటిరోజే 5,50,171 హాల్టికెట్ల డౌన్లోడింగ్
ఉద్యోగం ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో అభ్యర్థులున్నారు. ఇందుకు మొదటిరోజే భారీ సంఖ్యలో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడమే నిదర్శనం. గ్రూప్-4కు మొత్తం 9,51,204 దరఖాస్తులు రాగా, మొదటిరోజే 5,50,171 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొన్నారు. కాగా, చివరి నిమిషంలో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొంటే తలెత్తబోయే ఇబ్బందులను టీఎస్పీఎస్సీ వివరిస్తున్నది. ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా మెసేజ్లు పంపిస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నది.