317 జీవోపై సోయిలేని బీజేపీ, కాంగ్రెస్
యువతను మోసం చేసేందుకే అగ్నిపథ్
ఉద్యోగార్థులతో ముఖాముఖిలో హరీశ్రావు
సిద్దిపేట అర్బన్, జూలై 6: త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు ఉద్యోగార్థులు సంసిద్ధం కావాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తామని చెప్పారు. బుధవారం ఆయన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ‘కేసీఆర్ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్’లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి, 95% ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చేశారని చెప్పారు. అన్ని జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతోనే 317 జీవో తీసుకొచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీస అవగాహన, సోయి లేకుండా జీవో 317ను రద్దు చేయాలని రాద్ధ్దాంతం చేశాయని విమర్శించారు. ఉద్యోగార్థులకు నష్టం కలగవద్దనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్రంలో సుమారు 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,37,000 పోస్టులు భర్తీ చేసిందని వివరించారు. ఇప్పుడు 90 వేల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం 16 లక్షల ఉద్యోగాలు నింపితే తెలంగాణ వారికి లక్ష ఉద్యోగాలు వస్తాయి కదా, ఎందుకు నింపడంలేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
యువతను మోసం చేసేందుకే అగ్నిపథ్
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని హరీశ్రావు విమర్శించారు. కేవలం నాలుగేండ్లు ఉద్యోగం చేయించుకొని, ఇంటికి పంపే పథకమే అగ్నిపథ్ అని పేర్కొన్నారు. అది కూడా కాంట్రాక్ట్ పద్ధ్దతిలోనే ఉంటుందని, పెన్షన్ ఉండదని, వేరే ఉద్యోగం చేయరాదని చెప్పారు. యువతను మో సం చేసేందుకు అగ్నిపథ్ను కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు. అగ్నిపథ్ పేరుతో చదువులకు, ఉద్యోగాలకు యువతను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. తక్కువ డబ్బులతో పని చేయించుకొని బయటకు వెళ్లగొట్టేందుకే ఈ స్కీమ్ తెచ్చారని విమర్శించా రు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, ఉద్యోగాలను ఊడగొట్టడమే బీజేపీ విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో నిరుద్యోగం 8.7 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో డాలర్తో పోలిస్తే 59గా ఉన్న రూపాయి విలువను నేడు 79కి దిగజార్చారని మండిపడ్డారు. బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం ఉండదని, దుష్టచారం చేయడంలో డాక్టరేట్ సాధించారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూసాని శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్ పాల్గొన్నారు.