హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షకు వారంరోజులే మిగిలి ఉన్నది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తయితే, ఇకపై చదువబోయేది మరో ఎత్తు. వారం రోజుల క్లిష్ట సమయం అభ్యర్థులకు ఎంతో కీలకం. అభ్యర్థులు టెన్షన్ పడకుండా ఫైనల్ టిప్స్పాటించాలని సూచించారు గ్రూప్-1 శిక్షకురాలు దీపికారెడ్డి. అర్ధరాత్రి వరకు చదవొద్దని, కొత్తటాపిక్స్ జోలికి వెళ్లొద్దని, పునశ్చరణ మాత్రమే చేయాలని చెప్పారు. రాత్రంతా చదివి.. పరీక్ష రోజు (ఈ నెల 16న) ఆలస్యంగా నిద్రలేసి పరుగులుతీస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఆమె సూచనలు ఇచ్చారు. ఆమె మాటల్లోనే..
ప్రశాంతత అవసరం
మనం రాసేది ఆషామాషీ పరీక్ష కాదు. గూప్-1 అంటే స్టేట్ సర్వీస్ పోస్టు. ఒక్కసారి ఈ ఉద్యోగం సాధిస్తే.. ఉన్నత స్థానాన్ని అందుకున్నట్టే. అదే తప్పులు చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే. ఈ సమయంలో ప్రశాంతత ముఖ్యం. ఆందోళనతో కొత్త టాపిక్స్ను, బుక్స్ను ముందేసుకోవద్దు. పాతవి పునశ్చరణ లేదా.. కరెంట్ ఎఫైర్స్ రివిజన్ చేసుకోవా లి. మాడల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. ప్రశ్నలకు అన్సర్లు చేయడం తేలికవుతుంది.
ముందుగా వెళ్లడం మేలు
పరీక్ష కేంద్రాలకు వీలైనంత ముందుగా వెళ్లడం మేలు. ఆఖరి నిమిషంలో టెన్షన్తో పరుగెత్తితే చదివినదంతా ఆ టెన్షన్లో వృథా అవుతుంది. రవాణా సౌకర్యాలు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి.
క్షుణ్ణంగా చదవాలి
ప్రశ్నలను క్షుణ్ణంగా చదవాలి. తొందరపాటు అస్సలు పనికిరాదు. ప్రశ్నల్లో అడిగే స్టేట్మెంట్స్ను సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు.. కింది వారిలో భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారెవరు అన్న ప్రశ్నకు వెంకయ్యనాయడు, శంకర్దయాళ్శర్మ, కృష్ణకాంత్, ప్రణబ్ముఖర్జీ ఆప్షన్లు ఇచ్చి .. ఒకటి మాత్రమే సరైనది. ఒకటి రెండు, మూడు సరైనవే.. నాలుగు మాత్రమే సరైనది.. పైవేవికాదు.. అన్న ఆప్షన్లు ఇస్తారు. చాలామంది క్షుణ్ణంగా చదవక, వెంకయ్యనాయుడు పేరు చూడగానే సరైనది అనుకుని ఆన్సర్ చేసేస్తారు. కానీ, ప్రణబ్ తప్ప అంతా ఉపరాష్ట్రపతులే. ఇలాంటి తప్పిదాలతో మార్కులు పోగొట్టుకుంటారు.
ఎలిమినేషన్ టెక్నిక్ను పాటించాలి
మొత్తం 150 ప్రశ్నల్లో సగటుగా 100 ప్రశ్నలను బాగా చదివిన వారు సులభంగా ఆన్సర్ చేయగలరు. మిగతా 50 ప్రశ్నలను ఎలా ఛేదించాలన్నదే అభ్యర్థికి సవాల్. ఇందుకోసం ఎలిమినేషన్ టెక్నిక్స్ను పాటించాలి. నాలుగింటిలో రెండు ఆప్షన్లను ఎలిమినేట్ చేసి.. మిగిలిన వాటిలో ఏది సరైనది అనిపిస్తే దానిని ఎంచుకోవాలి. ఈ ప్రక్రియలో కచ్చితత్వాన్ని పాటించాలి.
టైం వేస్ట్ చేయొద్దు
180 నిమిషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆన్సర్లు రాని వాటిని పట్టుకొని టైం వృథా చేసుకోవద్దు. రాని వాటిని వదిలేస్తూ.. వచ్చినవాటికి ఆన్సర్లు చేస్తూ ముందుకెళ్లాలి.
ప్రశ్న నంబర్ను బట్టే బబ్లింగ్
తాజా నివేదికల ప్రకారం పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లో 7.1 శాతం విద్యార్థులు ఓఎమ్మార్లో బబ్లింగ్లో తప్పులు చేస్తున్నారు. ముందుగా తమ ఫేవరైట్ సెక్షన్ లేదా.. తమకు పట్టున్న సెక్షన్లోని ప్రశ్నలకు ఆన్సర్లు చేస్తుంటారు. కొంత మంది ప్రశ్నపత్రాల్లో ఆన్స ర్లు టిక్ చేసి.. తర్వాత ఓఎమ్మార్ను నింపుతారు. ఇలాంటప్పుడు ఒక దగ్గర పొరపాటుగా బబ్లింగ్ చేస్తే.. మొత్తం ఆన్సర్లు తప్పవుతాయి. ఇలా చేయడం శ్రేయస్కరం కాదు. ప్రశ్నల నంబర్ను సరిచూసుకుని బబ్లింగ్ చేయాలి.
కటాఫ్ చింత వద్దు
ఎగ్జామ్ సెంటర్లో కటాఫ్ గురించి అస్సలు ఆలోచించచొద్ద్దు. ప్రశ్నల తీరు.. కాఠిన్యతను బట్టి.. కటాఫ్ ఉంటుంది. అయినా నెగిటివ్ మార్కింగ్ లేదు. కనుక అభ్యర్థులు 150 ప్రశ్నలకు అన్సర్ చేయెచ్చు. అంతేకాని 150 ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్న ఆతృతతో తప్పలు చేయొద్దు.