హైదరాబాద్, అక్టోబర్ 13( నమస్తే తెలంగాణ) గ్రూప్ -1 పరీక్షలను ఈ నెల 16న యథాతథంగా నిర్వహించాలని, అయితే ఆ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే అంశంపై తాము వెలువరించే తుది ఉత్తర్వులకు కట్టుబడి పరీక్ష ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ జారీచేసిన జీవో 33ను గ్రూప్-1 పోస్టుల భర్తీకి కూడా అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. మెదక్ జిల్లా సర్ధనా హవేలీ ఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ స్వప్న మరో నలుగురు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారించింది. పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు గ్రూప్-1 పోస్టులకు అమలు చేసే విధంగా రోస్టర్ పాయింట్లను కేటాయించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బీ రచనారెడ్డి కోరారు. రోస్టర్ పాయింట్లను కేటాయించకపోతే చాలామంది ఎస్టీలు గ్రూప్-1 పోస్టులకు దూరం అవుతారని చెప్పారు. పాత రిజర్వేషన్లు ఆరు శాతమే అమలు చేస్తే ఎస్టీలకు 32 పోస్టులే లభిస్తాయని, రోస్టర్ పాయింట్లను ప్రకటిస్తే ఆ పోస్టుల సంఖ్య 50 వరకు పెరుగుతుందని తెలిపారు. వాదనల అనంతరం ప్రతివాదులైన జీఏడీ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ, విద్యా శాఖల ముఖ్యకార్యదర్శులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది.