హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ సకలం సిద్ధం చేసింది. ఆదివారం జరగనున్న పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 1019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది. ఇప్పటికే ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లు, వసతులు తదితర విషయాలను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలు ఉండే ప్రాంతాల వైపు అదనపు బస్సులు తిప్పనున్నది. హైదరాబాద్ సహా మిగిలిన నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుస్తు చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లుచేశారు. తెలంగాణలో జరిగే తొలి గ్రూప్-1కు అనూహ్య స్పందన లభించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే.. ప్రస్తుతం తెలంగాణలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. 503 పోస్టులకు 3,80,081 మంది దరఖాస్తు చేశారు.
గ్రూప్-1కు దరఖాస్తులు ఇలా…
గ్రాడ్యుయేట్లు : 2,53,369
పోస్టు గ్రాడ్యుయేట్లు : 1,22,826
ఇంటిగ్రేటెడ్ (డిగ్రీ + పీజీ) : 1,781
ఎంఫిల్ : 424
పీహెచ్డీ : 1,681
మొత్తం : 3,80,081