హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిబంధనల ప్రకారమే నిర్వహించామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు. పరీక్ష విధివిధానాలపై ఇన్విజిలేటర్లకు దశలవారీగా అవగాహన కల్పించామని చెప్పారు. అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తల గురించి వారం ముందే వివరించినట్టు స్పష్టంచేశారు. కొన్ని కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల తప్పిదంతో పరీక్ష కాస్త ఆలస్యంగా ప్రారంభమైనదని.. అయితే అభ్యర్థులకు అదనపు సమయాన్ని కేటాయించామని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమినరీ నిర్వహణకు సంబంధించిన అంశాలను జనార్దన్ రెడ్డి గురువారం ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పటిష్ట ప్రణాళికతో నిర్వహించామని జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రాలకు తరలించడం నుంచి పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్లను తీసుకురావడం వరకు అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి, టీఎస్పీఎస్సీ పర్యవేక్షకుడి సమక్షంలోనే ప్రశ్నపత్రాల సీల్ తెరిచినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశామని వివరించారు. పరీక్ష నిర్వహణలో ఆద్యంతం పారదర్శకత పాటించామన్నారు.
ఒకటి, రెండుచోట్ల మినహా అన్నిచోట్లా నిర్దేశించిన సమయం ప్రకారమే పరీక్ష నిర్వహించామన్నారు. మారేడ్పల్లిలోని లాలాగూడలో సెయింట్ ఫ్రాన్సిన్ డీ సేల్స్(ఎస్ఎఫ్ఎస్) హైస్కూల్లో మాత్రం కాస్త ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనదని చెప్పారు. అక్కడ ఇన్విజిలేటర్ల తప్పిదంతో అభ్యర్థులకు ఇంగ్లిష్/తెలుగుకి బదులుగా ఇంగ్లిష్/హిందీ ప్రశ్నపత్రాలు ఇచ్చారని తెలిపారు. చివరికి కలెక్టర్ స్వయంగా అభ్యర్థులతో మాట్లాడాక మధ్యాహ్నం 1 నుంచి 3.30 వరకు పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు.
ఆలస్యంగా పరీక్ష జరిగిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు పరిగణనలోకి తీసుకోరని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు జనార్దన్రెడ్డి తెలిపారు. ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని, పరీక్షకు హాజరైన ప్రతిఒక్కరి ఓఎంఆర్ షీట్ను వ్యాలిడేట్ చేస్తామని చెప్పారు. ఎవరైనా బబ్లింగ్లో తప్పిదాలు చేస్తే తప్ప.. లేనిపక్షంలో అందరి ఓఎంఆర్ షీట్లను పరిగణలోకి తీసుకొంటామని స్పష్టంచేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తామని జనార్దన్ రెడ్డి తెలిపారు. మరో ఐదురోజుల్లో స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, వెంటనే అభ్యర్థులందరి ఓఎంఆర్ షీట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని పేర్కొన్నారు. కొందరు బబ్లింగ్ సరిగా చేయలేదని కొందరు అభ్యర్థులు టీఎస్పీఎస్సీని ఆశ్రయిస్తున్నారని, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందని జనార్దన్రెడ్డి గుర్తుచేశారు.