TSPSC | ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. దీంతో గ్రూప్ -1 ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఒక రోజు ముందే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు.
ఓ అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. సదరు అభ్యర్థి అభ్యర్థన కారణంగా ఈ ఫలితాలను నిలిపివేయడం సరికాదని, ఆ అభ్యర్థి స్థానికత అంశంపై తర్వాత విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ -1 ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్ఫత్తిలో 25,050ని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో ఉంచింది. జూన్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించారు. అనంతరం నవంబర్ 15వ తేదీన తుది కీని ప్రకటించారు. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించి, ఫలితాలను విడుదల చేసింది.