హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదుచేస్తుండటంతో ఉదయం 10.15 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ ముందుగానే సూచించింది. దీంతో అభ్యర్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. పలు ప్రాంతాల్లో 10.15 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది.
మొత్తం 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫకేషన్ విడుదల చేసింది. దీనికోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 1019 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.