Group-1 Mains | చిక్కడపల్లి, అక్టోబర్ 16: అశోక్నగర్ మరోసారి రణరంగంలా మారింది. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ గర్జించారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో దొర్లిన తప్పులను, జీవో 29ని సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి గ్రూప్స్ అభ్యర్థులు దూసుకొచ్చి నినాదాలు చేయడంతో అశోక్నగర్ ప్రాంతమంతా దద్దరిల్లింది. దీంతో భారీగా పోలీసులు మోహరించి నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై ఉక్కుపాదం మోపారు. పలువురు అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి బేగంబజర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్ధన్, ఇంద్రానాయన్, నర్సింహ, విశాల్, ఝాన్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువు అభ్యర్థులు మాట్లాడుతూ జీవో 29, జీవో 55పై ఎటూ తేల్చకుండా, తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా ఆగమేఘాల మీద గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమో? కాదో? చెప్పకుండా ప్రశ్నల్లో తప్పులు దొర్లకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వకుండా, తెలుగు అనువాదం సరిగ్గా ఇస్తారా? లేదా? చెప్పకుండాపరీక్షలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఇవ్వన్నింటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే గ్రూప్-2, 3 పరీక్షలు పెట్టలనుకోవడం కూడా నిరుద్యోగులను నిండా ముంచడమేనని మండిపడ్డారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై సుమారు 33 కేసులు దాఖలయ్యాయని, అవన్నీ పరిష్కారమైన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలు 2011లోనూ నిర్వహించి రద్దు చేశారని, 2016లో తిరిగి నిర్వహించారని గుర్తుచేశారు. మెయిన్స్ పరీక్షల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్లో అన్ని ప్రశ్నలూ తప్పులతడకలేని, 150 ప్రశ్నలకు 20 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని గుర్తుచేశారు. ఈ కేసులన్నీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తన మద్దతు కావాలని కోరిన గ్రూప్-1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారిని కలుస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘కేటీఆర్ సర్.. మమ్మల్ని క్షమించండి.. దయచేసి అశోక్నగర్ రండి.. మాకు మీ మద్దతు కావాలి.. అన్ని సంస్థలూ రాజీపడ్డయ్.. మీరు వస్తే మీకు మొత్తం గ్రూప్-1 సంఘం రుణపడి ఉంటుంది..’ అంటూ టీజీపీఎస్సీ అస్పిరెంట్స్ పేరిట సామాజిక మాధ్యమాల్లో విన్నపాలు వెల్లువెత్తాయి. ఇందుకు ప్రతిగా కేటీఆర్ స్పందిస్తూ ‘మిమ్మల్ని కలుస్తాను. అశోక్నగర్ వేదికగా అయినా కావచ్చు లేదా తెలంగాణ భవన్ వేదికగా అయినా సరే మిమ్మల్ని కలుస్తా’నని కేటీఆర్ ఎక్స్ వేదికగా హామీఇచ్చారు. ‘భారత రాష్ట్ర సమితి పార్టీ మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తుంది’ అని భరోసా ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ యువతకు, తెలంగాణ సమాజానికి ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ సర్.. మీ మద్దతు కావాలి..