హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం రాజేంద్రనగర్లో నిర్మిస్తున్న హైకోర్టు భవన సముదాయం పనుల్లో భాగంగా ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తుల నివాసాల విల్లాలకు ఏప్రిల్ 5న భూమిపూజ చేయనున్నారు. ఈ క్ర మంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్కుమార్ సింగ్తోపాటు పలువురు న్యాయమూర్తులు, రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్తో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా భూమిపూజ నాటికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు భవన సముదాయ పనులు వేగంగా సాగేందుకు కాంట్రాక్టర్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో జోన్-1లోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఇన్స్టిట్యూషనల్ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతుండగా, జోన్-2లో న్యాయమూర్తుల నివాసాల కోసం విల్లాలను నిర్మిస్తున్నారు.