మహబూబ్నగర్ : మరో కొద్ది గంటల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. నవ వరుడి దుర్మరణంతో అటు వధువు ఇంట, ఇటు మృతుడి ఇంట విషాదం అలుముకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్లోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్య (35) నారాయణపేట జిల్లా తిర్మలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల వనపర్తికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు మహబూబ్నగర్లోని ఎంబీ చర్చిలో పెళ్లి జరుగాల్సి ఉన్నది.
అయితే, చైతన్య ఉదయం 5 గంటలకు జడ్చర్లకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి కారులో బయలుదేరాడు. నక్కలబండ తండా వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చైతన్య స్నేహితులను తీసుకువచ్చేందుకు కారులో వెళ్లినట్లు తెలుస్తున్నది. మరి కొద్ది గంటల్లో పెళ్లి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మరో వైపు చైతన్య మృతితో వధువు కుటుంబీకులు షాక్కు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.