కరీంనగర్: పెళ్లి కోసం చేసిన అలంకరణలతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. వధూవరులు ఇద్దరి తరఫు బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో మండపానికి చేరుకుని వేడుకను వీక్షిస్తున్నారు. వధూవరులిద్దరూ వేదికపైకి రావడం.. వధువు తండ్రి వరుడి కాళ్లు కడుగడం.. పెళ్లికొడుకు, పెళ్లికూతరు ఇద్దరికీ జీలకర్ర బెల్లం పెట్టించడం లాంటి కార్యాక్రమాలు అన్నీ ముగిశాయి. ఇక పెళ్లి తంతు వధువు మెడలో వరుడు మూడుముళ్లు వేసే దాకా వచ్చింది. ఇంతలో పెళ్లికొడుకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
వధువు తండ్రి తనకు బైక్ కొనిస్తేనే తాళి కడుతా అని భీష్మించుకు కూర్చున్నాడు. ఇప్పటికిప్పుడు బైక్ అంటే ఏడ తెవాల్నని పెళ్లికూతరు తండ్రి తలపట్టుకున్నాడు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పెద్దవాళ్లు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పెళ్లికొడుకు తాళికట్టేందుకు ససేమిరా అన్నాడు. దాంతో అందరూ ఇక పెళ్లి ఆగిపోతుందనే భావించారు. కానీ, ఈ గొడవ జరుగుతుండగానే మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వివాహ వేడుకకు హాజరయ్యారు. విషయం తెలుసుకుని బైక్ కోసం వరుడి చేతిలో రూ.లక్ష పెట్టి.. వధువు మెడలో తాళికట్టించారు. దాంతో ఆగిపోతుందనుకున్న పెళ్లిని సజావుగా జరిపించిన ఎమ్మెల్యేకు వధూవరులిద్దరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాలపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గాజుల మల్లయ్య కుమార్తె వివాహం ఇవాళ (శుక్రవారం) మొలంగూరు శివారులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా తీరా తాళికట్టే సమయంలో మామ తనకు బైక్ కొనివ్వలేదని వరుడు అలిగాడు. బైక్ కొనిస్తేనే తాళి కడుతానని మొండికేశాడు. చివరికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యంతో పెళ్లి సజావుగా సాగింది.