హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఫుడ్ ప్రొవిజన్ (కిరాణా సామగ్రి) వస్తువుల్లో 200 కోట్ల గోల్మాల్ జరిగిందనేది అబద్ధమని టెండర్లను పర్యవేక్షిస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు పీఎంయూ చైర్మన్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫుడ్ప్రొవిజన్ టెండర్లలో గోల్మాల్ అంటూ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై పీఎంయూ చైర్మన్ స్పందించారు. ఇప్పటికీ ఫుడ్ ప్రొవిజన్ టెండర్ను ఖరారు చేయలేదని తెలిపారు. దాఖలైన బిడ్ల పరిశీలన కొనసాగుతున్నదని, ఇప్పటికీ ఫుడ్ ప్రొవిజన్ వస్తువుల ధరలను ఖరారు చేయలేదని వివరించారు. అదీగాక అన్ని ఖర్చులతో కూడిన, ఇంటి వద్దకే డెలివరీ చేసే సంస్థాగత ధరలను మారెట్ ధరతో పోల్చడం సరికాదని వివరించారు. టెండర్ ధరల్లోనే మారుమూల గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు సహా, 33జిల్లాలో విస్తరించిన 3వేలకు పైగా సంస్థలకు జీఎస్టీ, రవాణా, లోడింగ్/అన్ లోడింగ్, డోర్-డెలివరీ చార్జీలు అన్ని కలిపి ఉంటాయని తెలిపారు.