హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా మరే ఒక్క ప్రాజెక్టును కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ సర్కారు కరాఖండిగా తేల్చిచెప్పింది. ఆ ప్రాజెక్టు నిర్వహణకు కావాల్సిన మేరకే సీడ్మనీ చెల్లిస్తామని స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అజగేశణ్ అధ్యక్షతన గురువారం కొనసాగిన సబ్కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగింది.
ప్రధానంగా ప్రాజెక్టుల అప్పగింత, సీడ్మనీ, అదనపు ఉద్యోగుల నియామకం తదితర అంశాలపై చర్చించారు. రివర్ బోర్డు గెజిట్ను అనుసరించి షెడ్యూల్ 2లో ఉన ప్రాజెక్టులన్నీ అప్పగించాలని, ఇరు రాష్ర్టాలు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీ చెల్లించాలని, ప్రాజెక్టుల నిర్వహణ తదితర వాటి కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఎజెండాలో ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఉమ్మడిది అయిన పెద్దవాగు ప్రాజెక్టును మినహాయించి మిగతా అన్ని ప్రాజెక్టులను అప్పగించాలని జీఆర్ఎంబీ కోరడం ఏంటని నిలదీసింది. ప్రాజెక్టుల అప్పగింతపై గత సమావేశంలోనే స్పష్టంగా తెలిపినా మినిట్స్లో సరిగా నమోదు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఇక సీడ్మనీపై కూడా వాదనలు బలంగా వినిపించింది. పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డుకు అప్పగిస్తామని, అందుకు రూ.200 కోట్లు సీడ్మనీ అవసరం లేదని తేల్చిచెప్పింది.
కేవలం ఆ ప్రాజెక్టు నిర్వహణ కోసం అదనంగా రూ.1.45 కోట్ల నిధులను మాత్రమే సమకూర్చుతామని స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ ప్రధాన కార్యాలయంలో డీపీఆర్ల అప్రయిజల్, పరిపాలన సౌలభ్యం కోసం అదనంగా ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈలు, నలుగురు జేఈలు ఇతర సిబ్బందిని కలుపుకొని 15 మంది సిబ్బందిని అదనంగా ఇచ్చేందుకు అంగీకరించింది. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులిస్తామని, కానీ ఆ పనులు జీఆర్ఎంబీ ఆధ్వర్యంలో కొనసాగాలని స్పష్టంచేసింది.
తెలంగాణ వాదనలకు భిన్నంగా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీంటినీ రివర్ బోర్డుకు అప్పగించాల్సిందేనని పట్టుబట్టిన ఏపీ, తుదకు తెలంగాణ తన ప్రాజెక్టులను అప్పగిస్తేనే తాము అప్పగిస్తామని మెలికపెట్టింది. సమావేశంలో జీఆర్ఎంబీ మెంబర్ (పవర్) కుటియల్, తెలంగాణ అంతర్రాష్ట్ర జలమండలి చీఫ్ ఇంజినీర్ మోహన్కుమార్, ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్ పుల్లారావు, ఈఈలు ఏసుబాబు, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.