హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తమ చెమట చుకలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక కష్టజీవికి సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. మే’డేను పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు. మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని పేర్కొన్నారు. కార్మిక, కర్షక సంక్షేమం, వారి అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ. 6 లక్షలు చెల్లిస్తున్నామని వివరించారు. 2014 నుంచి 2023 వరకు ఇలా మరణించిన కార్మికుల కుటుబాలు 4,001కి రూ. 223 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైన 504 మంది కార్మికులకు రూ. 8.9 కోట్లను చెల్లించామని తెలిపారు. కార్మిక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల పెండ్లికి రూ. 30,000 చొప్పున ‘వివాహ బహుమతి’ని రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్నదని సీఎం వివరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 46,638 మంది లబ్ధిదారులకు రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు.
మానవీయ కోణంలో కార్మికుల ఆలన
మహిళా కార్మికులకు రెండు కాన్పుల వరకు కాన్పుకు రూ. 30,000 చొప్పున ప్రసూతి ప్రయోజనాలను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. 2014 నుంచి ఇప్పటివరకు 1,01,983 మంది లబ్ధిదారులకు రూ. 280 కోట్లను చెల్లించామని తెలిపారు. కార్మికులు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ. లక్ష మొత్తాన్ని చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 2014 నుంచి 2023 వరకు మరణించిన 35,796 మంది కార్మికులకు రూ. 288 కోట్లను చెల్లించామని తెలిపారు. కార్మికుల పై ఆధారపడిన 1,49,536 మంది లబ్ధిదారులకు రూ.94 కోట్లను చెల్లించామని పేర్కొన్నారు. కార్మికుల మరణానంతరం వారి అంత్యక్రియల కోసం 39,797 మందికి రూ. 98 కోట్లను చెల్లించామని తెలిపారు. కొవిడ్ కాలంలో రూ. 1,005 కోట్లను పలు కార్యక్రమాల కింద ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.