పచ్చదనం పెంపులో తెలంగాణ రోల్మాడల్ అని ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హీమ్ కొనియాడారు.
‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన తెలంగాణ ‘హరిత’ కృషిని ప్రశంసించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని, దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్మాడల్గా నిలుస్తున్నదని ప్రముఖ పర్యావరణవేత్త, నార్వే మాజీ మంత్రి ఎరిక్ సొల్హీమ్ కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని, ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడారు.
ప్రపంచం పర్యావరణ మార్పులకు గురువుతున్నది. ైక్లెమెట్ చేంజ్ అన్నది అతి పెద్ద సవాలుగా మారింది. దీనిని ఎలా ఎదుర్కోవచ్చు?
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు అతిపెద్ద సవాలు. ైక్లెమెట్ చేంజ్ మన ముందున్న సమస్య. గ్రీస్, టర్కీ, అమెరికా, కెనడా, లిబియా, పాకిస్థాన్, భారత్ తదితర దేశాల్లో అకాలవర్షాలు, అడవులు కాలిపోవడం (వైల్డ్ఫైర్స్), ప్రకృతి ఉత్పాతాలు చూస్తున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటివి రాకుండా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలి. ైక్లెమెట్ చేంజ్ దుష్పరిణామాలను చూస్తున్నాం. లక్షల మందిపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నది. కొన్ని దేశాలు తీసుకుంటున్న చర్యలతో అక్కడి ప్రజలు కొంత మెరుగ్గా ఉంటున్నారంతే. చైనా, అమెరికా, యూరప్, భారత్ వంటి దేశాలు కొన్ని చర్యలు చేపట్టాయి. గ్రీన్ సబ్సిడీలు ఇస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ పేరుతో వాహనాల తయారీ, విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సంబంధమైన వాహనాల తయారీలో మార్పులు చేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు పచ్చదనం, పర్యావరణ రక్షణ వంటి విషయాల్లో దూరదృష్టితో, నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఇది అందరి బాధ్యత.
తెలంగాణ సీఎం కేసీఆర్ పాతాళంలో ఉన్న గోదావరి నది నీళ్లను పంటపొలాలకు పారిస్తున్నారు. ప్రతి ఏటా 1,600 టీఎంసీల నీళ్లను సద్వినియోగం చేస్తున్నారు. దేశానికి కూడా ఒక నీటివిధానం ఉండాలని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
నీటిని నిల్వ చేయడం, సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఒకవైపు నీటి కోసం అనేక ప్రాంతాలు ఇబ్బందిపడుతున్నాయి. సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగించడం మంచిది. మరోవైపు పర్యావరణానికి కూడా నీళ్లతో సంబంధం ఉంటుంది. నీళ్లు ఉంటే మొక్కలు పెరుగుతాయి. అడవులకు రక్షణ ఉంటుంది. నీళ్లు, పచ్చదనం పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. నీళ్లుంటే పచ్చదనం ఉంటుంది. పచ్చదనం ఉంటే వానలు కురుస్తాయి.
హైదరాబాద్లో ఇటీవల ఫార్మూలా వన్-ఈ రేస్ జరిగింది. హైదరాబాద్కు గ్రీన్సిటీ, వరల్డ్ ట్రీసిటీ అవార్డులు కూడా వచ్చాయి కదా!
హైదరాబాద్ పరిపరివిధాలుగా ఎదుగుతున్నది. దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. హైదరాబాద్ ఒక హైటెక్సిటీ, గ్రీన్సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం. ప్రజలు ఇలాంటి నగరాల్లో జీవించాలని కోరుకుంటారు. ఉద్యోగ అవకాశాలు, మంచి వాతావరణం, మంచి అటవీ, అర్బన్ పార్కులు దగ్గరలో ఉండటం ఒక కారణం. హైదరాబాద్ ఎదుగుదలకు ఇక్కడ ఉన్న నీటి వనరులు, నీటి సౌకర్యం, అర్బన్ పార్కులు వంటివి ప్రధాన కారణం.
తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీని ప్రారంభించింది. దీనిపై మీ అభిప్రాయం..?
ఇది మంచి పరిణామం. రాబోయే 5-10 ఏండ్లలో వచ్చే కొత్తకార్లు, కొత్త మోటరుబైక్లు ఎలక్ట్రిక్వే వస్తాయి. 90% వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపాంతరం చెందుతాయని నా అంచనా. నార్వేలో కొత్తగా కొంటున్న వాహనాల్లో 90% ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. భారతదేశం ఇక్కడి ప్రజలకు ఉద్యోగ సౌకర్యాలు కల్పించాలనుకుంటే, ఇక్కడి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్తున్నది. ఇక్కడ ఈ-మొబిలిటి వ్యాలీని ప్రారంభించడం వల్ల వాహనాల ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. దీంతోపాటు ఉద్యోగావకాశాలు వస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిందేమిటి?
పచ్చదనం పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, చిత్తశుద్ధి, ఆయన అనుసరిస్తున్న విధానాలు అద్భుతం. అర్బన్పార్కులను అభివృద్ధి చేయడం, చెరువులను బాగుచేయడం వంటివాటిని దశలవారీగా చేపట్టారు. ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. నేను 1990ల్లో ఒకసారి, 15 ఏండ్ల క్రితం మరోసారి హైదరాబాద్కు వచ్చాను. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. పచ్చదనం పెంపులో జరుగుతున్న మార్పు కండ్లకు కనిపిస్తున్నది. హైదరాబాద్ ఒక భిన్నమైన నగరం. ఇది రాత్రికి రాత్రి వచ్చిన అభివృద్ధేమీ కాదు. ఒక దూరదృష్టి, చిత్తశుద్ధి, సంకల్పంతో చేసినపని.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏమిటి?
దేశంలో గ్రీన్కవర్ అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. నాకున్న సమాచారం ప్రకారం 7 శాతానికిపైగా వృక్ష సంపదలో తెలంగాణ వృద్ధి సాధించింది. ఇది మంచి సంకేతం. భారత్లో తెలంగాణ తరహా విధానాలు మరెక్కడా లేవు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మొక్కలు పెద్ద ఎత్తున నాటడం ప్రారంభించింది. తమిళనాడులో జాతీయ ఉద్యానవనాల ఏర్పాటు, చిత్తడి నేలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాయి. కొన్ని రాష్ట్రాలు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదనడంలో సందేహంలేదు. పర్యావరణ రక్షణ చర్యలు తీసుకోవడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ స్ఫూర్తినిస్తున్నది.
గ్రీన్ హైడ్రోజన్పై జరుగుతున్న చర్చ గురించి మీరేమంటారు…?
భారత్లో గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసమే కాకుండా.. షిప్పింగ్, ఏవియేషన్, హెవీట్రక్కులు.. ఇలా చాలా వాటికి ఇది ఉపయోగకరమైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. అనేక రాష్ట్రాలు కేంద్రంతో కలిసిపనిచేస్తున్నాయి. ఇది మంచి పరిణామం. దీనికి అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులకు మౌలిక వసతులను మరింత పెంచాలి. ఆర్థిక వనరులను సమకూర్చాలి. ఇలా చేస్తే గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్కు చేయుత ఇచ్చినట్టవుతుంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. నీటి వనరుల ఉపయోగంపై మీ అభిప్రాయం?
హైడ్రోపవర్ను సద్వినియోగం చేసుకోవాలి. హైడల్పవర్తో పర్యావరణానికి మంచిది. నార్వేలో హైడ్రోపవర్ ప్రాజెక్టులే ఎక్కువగా ఉంటాయి. నీటిని సద్వినియోగం చేసుకునే ప్రతి చర్యా మంచిదే. ఆహ్వానించదగ్గదే.