నిర్మల్, ఏప్రిల్ 7: పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరుస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాలు పచ్చదనంతో ఉండాలని, అభివృద్ధి పథంలో కొనసాగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అందుకే ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కింద 15 ఎకరాల్లో రూ. 40 లక్షల వ్యయంతో ఈ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వల్లడించారు.
వైద్య సిబ్బందిని సన్మానించిన మంత్రి..
సోన్ మండల కేంద్రంలోని పిల్లల ప్రభుత్వ పాఠశాలలో చిన్న పిల్లల ఆటల కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగాపెట్టి సేవలందించిన వైద్య సిబ్బందిని, ఆశా కార్యకర్తలను మంత్రి సన్మానించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ముశారఫ్ అలీ పారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బర్కడే, స్థానిక తదితరులు పాల్గొన్నారు.