హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకాల అమలుపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి దగ్గర ఉన్న పిటిషన్పై విచారణ ప్రక్రియను కూడా నిలిపివేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిమిత్తం ప్రభుత్వం 2014 నుంచి జారీచేసిన 8 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంతో ఆ పథకాల అమలుపై సింగిల్జడ్జి స్టే ఇచ్చారు. స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అవివాహిత యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఆ తరువాత వీటిని బీసీ, ఈబీసీ వర్గాల మహిళలకూ విస్తరింపజేసినట్టు వివరించారు.
బాల్యవివాహాలను అరికట్టడంలో సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పథకాలున్నాయని తెలిపారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదని, పిటిషన్ వేసే అర్హత కూడా పిటిషనర్కు లేదని అన్నారు. గత రెండేండ్లుగా అమల్లో ఉన్న పథకాలను ఇప్పుడు నిలిపివేస్తే వేలాది మంది లబ్ధిదారులు నష్టపోతారని తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్తోపాటు పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో అమలు చేస్తున్నారని చెప్పారు. 2014 నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారని, ఈ పథకాలు పిటిషనర్పై ఎలాంటి ప్రభావం చూపడంలేదని అన్నారు. పిటిషనర్ విజయ్గోపాల్ వాదనలు వినిపిస్తూ పథకాలను కేవలం మహిళలకే అమలు చేయటం.. వివక్ష చూపడమేనని, దీనిపై పిటిషన్ వేసే అర్హత పౌరుడిగా తనకు ఉందని తెలిపారు.
పథకాల అమలులో రాజ్యాంగబద్ధతను తాను ప్రశ్నించడంలేదని, వాటికి ఎలాంటి చట్టం మద్దతు లేదని మాత్రమే ప్రశ్నించానని చెప్పారు. కేవలం జీవోల ఆధారంగా పథకాలను అమలు చేసే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు లేదని చెప్పారు. ఇప్పటికే ఈ పథకాల కింద వేల కోట్లకు పైగా ప్రజాధనం పంపిణీ చేశారని, వీటి చట్టబద్ధత తేలకుండా అమలుకు అనుమతించరాదని కోరారు. ఒకవేళ పథకాన్ని కొనసాగించి ప్రజాధనం పంపిణీ చేస్తే వెనకి తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ పథకాలకు మంజూరు చేసిన నిధులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాగ్ ఏదైనా నివేదిక సమర్పించిందా అని ప్రశ్నించింది.
గత 12 ఏండ్ల నుంచి శాసనపరమైన, రాజ్యాంగపరమైన అనుమతి లేకుండా వివిధ ప్రభుత్వాలు ఈ నిధులను ఖర్చు చేశాయని, ఇది భవిష్యత్తులో ప్రభుత్వం ఎదురోవాల్సిన అనధీకృత వ్యయం అంటూ కాగ్ ఏదైనా అభిప్రాయం వెల్లడించిందా లేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేరొంది. దీనిపై అసెంబ్లీ లేదంటే ఇతర వేదికల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే వాటిని సమర్పించాలని సూచించింది. ఈ దశలో పథకాల అమలును నిలిపివేయడం సరికాదని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతోపాటు పిటిషన్పై కూడా విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్కు వాయిదా వేసింది.