హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న ‘గ్రేప్ ఫెస్టివల్’ (ద్రాక్ష పండుగ)కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ప్రత్యక్షంగా తోటల్లోకి వెళ్లి పరిశీలించి.. నచ్చినరకం పండ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించడంతో.. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి ద్రాక్ష పండ్లను కొనుగోలు చేస్తున్నారని ద్రాక్ష పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అనిత కుమారి చెప్పారు.
పరిశోధన కేంద్రంలో 52 రకాల ద్రాక్ష చెట్ల నుంచి ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ క్షేత్రానికి సందర్శకులు రావొచ్చని నిర్వాహకులు వెల్లడించారు. ద్రాక్ష రకాల ఆధారంగా కేజీ ధర రూ.250 నుంచి రూ.700 వరకు నిర్ణయించినట్టు చెప్పారు. పంటల మార్పిడిలో భాగంగా ద్రాక్ష సాగును ప్రోత్సహిస్తామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ డీ రాజిరెడ్డి సూచించారు. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 వేల ఎకరాల్లో ద్రాక్ష సాగు ఉండేదని, ప్రస్తుతం 400 ఎకరాలకు పడిపోయిందని వాపోయారు.
రియల్ ఎస్టేట్ పెరగడం ప్రధాన కారణమైతే, పంట సాగు ఖర్చులు, కూలీ ఖర్చులు పెరగడంతో చాలామంది ద్రాక్ష తోటలు తీసి వేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వర్సిటీ పరిధి సంగారెడ్డిలోని పండ్ల పరిశోధన స్థానం, మల్లేపల్లిలోని ఉద్యాన పరిశోధన స్థానంలో ద్రాక్ష సాగును ప్రయోగాత్మకంగా చేసి అనుకూలతలను పరిశీలించి రైతులకు సిఫార్సు చేస్తామని తెలిపారు. రైతు ద్రాక్ష సాగు చేపడితే.. ఉపాధి పెరగడంతోపాటు లాభాలు కూడా చాలా ఉంటాయని వెల్లడించారు. ఒకప్పుడు హైదరాబాద్కు ‘గ్రేప్ సిటీ’ అనే పేరు ఉందని, అనాబ్-ఈ- షాహి వంటి రకం అప్పట్లో హైదరాబాద్ ప్రాంతంగానే అభివృద్ధి జరిగిందని ప్రధాన శాస్త్రవేత్త అనిత కుమారి చెప్పారు.