కామారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన, చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ తీపి కబురు అందించింది. జిల్లాకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (MJPTBCWREIS) ను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి బి.వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 బీసీ డిగ్రీ కళాశాలలను మంజూరు చేయగా, అందులో కామారెడ్డి జిల్లా ఉంది. ఈ కళాశాలను ప్రస్తుత విద్యా సంవత్సరం (2023-24)లోనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు 8 ఉన్నాయి. వీటిలో బాలురు 1704, బాలికలు 1343 మంది మొత్తం 3047 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో బీసీ జనాభా ఎక్కువగా ఉండడం, బీసీ వర్గాల్లో చదువుతున్న వారి సంఖ్య పెరగడంతో డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. డిగ్రీ కళాశాల మంజూరుతో బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ తర్వాత డిగ్రీ కళాశాలలు లేక కొందరు మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. పట్టణాలకు వెళ్లి నెలనెలా రూ.వేలకు వేలు ఖర్చు చేసి డిగ్రీ చేయాలంటే ఇబ్బందికరంగా ఉండేది. ప్రభుత్వం జిల్లాకు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను మంజూరు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఎంతో సౌలభ్యం ఏర్పడింది. ఈ సందర్భంగా బీసీ వర్గాలు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.