కంది, జూలై 30 : కూతురి రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడని ఆమె రెండేండ్ల కొడుకును సొంత అమ్మమ్మే పొట్టనబెట్టుకున్న దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాకేంద్రంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డిలోని రాజంపేటకు చెందిన కట్ట నాగమణికి కూతురు సుజాత ఉన్నది. ఆమెకు పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాలకు చెందిన మధుతో 2014లో వివాహమైంది. వీరికి కొడుకులు మహేశ్(5), యశ్వంత్(2) ఉన్నారు. రెండేండ్ల క్రితం చౌటకూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు చనిపోయాడు. ఆ తర్వాత సుజాతకు పుల్కల్ మండలానికి చెందిన జనార్దన్తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ క్రమంలో సుజాతను పెండ్లి చేసుకోవాలని జనార్దన్ను ఆమె తల్లి నాగమణి కోరింది. సుజాత కొడుకులను విడిచిపెడితే పెండ్లి చేసుకుంటానని చెప్పడంతో పెద్ద కొడుకు మహేశ్ను బంధువులకు దత్తత ఇచ్చేందుకు నిర్ణయించారు. కాగా, చిన్నకొడుకు యశ్వంత్ సుజాత వద్దే ఉన్నాడు. కూతురు వివాహానికి యశ్వంత్ అడ్డుగా ఉన్నాడని భావించిన నాగమణి.. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డిలోని బొబ్బిలికుంట చెరువులో తోసేసింది. తన కొడుకు కనిపించట్లేదని సుజాత తల్లి నాగమణితో కలిసి సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఉదయం బొబ్బిలికుంటలో పసివాడి మృతదేహం ఉన్నట్టు అందిన సమచారంతో పోలీసులు ఘటనా స్థలికి సుజాతను పిలిపించారు. చనిపోయింది తన కొడుకేనని ఆమె చెప్పింది. విచారణలో తానే మనుమడిని చంపినట్టు నాగమణి ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.