హైదరాబాద్ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కండ్లముందే ఆడుకున్న మనవరాలు అంతలోనే కన్నుమూయడంతో ఆ నానమ్మ హృదయం తట్టుకోలేకపోయింది. చిన్నారి మృతి చెందడంతో గుండెపోటుతో నానమ్మ తనువు చాలించింది. ఈ హృదయవిదారకమైన సంఘటన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రియాన్షి(18 నెలలు) అనే చిన్నారి ఆడుకుంటే వెళ్లి నీటి సంపులో పడి మృత్యువాత పడింది.
మనవరాలు మృతితో ఏడుస్తూ నానమ్మ మారబోయిన నాగమ్మ(65) గుండెపోటుకు గురై మృతి చెందారు. నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.