ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: పూర్వ విద్యార్థుల రాకతో ఉస్మానియా యూనివర్సిటీ సందడిగా మారింది. వీరంతా ఒక దగ్గరికి చేరి… గతస్మృతులను నెమరువేసుకొన్నారు. ఇందుకు మంగళవారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన అలుమ్ని మీట్ వేదికైంది. ఈ సందర్భంగా ఓయూ వీసీ రవీందర్ మాట్లాడుతూ, వర్సిటీ పూర్వవైభవం సాధించే దిశగా ఇటీవల తీసుకొన్న చర్యలను వివరించారు. వర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపేందుకు పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో ఓయూ విద్యార్థులు అత్యున్నత స్థాయిల్లో ఉన్నారని గుర్తుచేశారు. వీరంతా తమ మేధాసంపత్తిని విద్యార్థులకు అందజేయాలని కోరారు. ఉస్మానియా ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ వర్సిటీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచం నలువైపులా ఉన్న పూర్వ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వీరు ఇచ్చే విరాళాల సేకరణకు ఉస్మానియా ఫౌండేషన్ను నెలకొల్పినట్టు వివరించారు.
దీని ద్వారా వర్సిటీని అభివృద్ధి బాటలో నడుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఓయూ టీవీ చానల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ట్యాపింగ్ అలుమ్ని పవర్ ఫర్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్’అనే అంశంపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, నగర సీపీ సీవీ ఆనంద్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం, ఐఎఫ్ఎస్ అధికారి, కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖ ఓఎస్డీ రాజశేఖర్, ప్రముఖ దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల, ఫ్యుజీ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు మనోహర్రెడ్డి పాల్గొన్నారు. ‘డిస్కషన్ ఆన్ గ్లోబల్ కనెక్ట్ – ఇనిషి యేటివ్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ’ అనే అంశంపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో వీణ గుండవెల్లి, డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, డాక్టర్ వెంకటరాజు, జనేత కంచర్ల, మహమ్మద్ మాజిద్ హష్మి సయీద్, వేనేపల్లి భాస్కర్రావు, కొండ సంజయ్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ మల్లేశం, పలువురు అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.