Local Body Elections | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నట్టు జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా? పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సమరం మొదలవుతుందా? ఈ ప్రశ్నలకు అ సాధ్యం అని సమాధానం చెప్తున్నారు న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు. స్థానిక సంస్థల పదవుల ఆశ చూపి, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపి, తద్వారా లోక్సభ ఎన్నికల గండం గట్టెక్కడానికే రేవంత్రెడ్డి ఈ ప్రకటన చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. జూ న్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ అంశం ప్రధాన అడ్డంకిగా మారుతుందని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని జూన్లోగా తేల్చడం ఆషామాషీ వ్యవహారం కా దని గుర్తుచేస్తున్నారు. మరికొన్ని కారణాల రీత్యా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు సా ధ్యం కాదని భావిస్తున్నారు. నిజానికి, రాష్ట్రం లో గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల గడువు జూన్తో ముగియనున్నది. అత్యధిక పట్టణ స్థానిక సంస్థల పదవీ కాలం కూడా వచ్చే జనవరిలో పూర్తికానున్నది. ఆయా ఎన్నికలను నిర్వహించాలంటే ముం దుగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల అశంపై గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రాతిపదికను నిర్ణయించడానికి, అధికారికంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి ప్రత్యేకంగా (డెడికేటెడ్) బీసీ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ పలు రాష్ర్టాల్లో పర్యటించి అక్కడ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను అమలుచేస్తున్న విధానం, బీసీ జనాభా లెక్కలను ఖరారు చేసిన విధానాలపై అధ్యయనం చేసింది. మన రాష్ట్రంలోని పలు శాఖల అధికారులతోనూ సమావేశమైంది. నివేదికకు తుది రూపు ఇవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం కొత్తగా కులగణనను తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీసీ కులాలే కాదు అన్ని కులాల లెక్కలను తేల్చాలని నిర్ణయించింది. అయితే, ఇం దుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ఇంకా ప్రారంభంకాలేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు అమలులో ఉండటం, అధికారులంతా ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటంతో మరో రెండు నెలల వరకు కులగణన ప్రారంభమయ్యే అవకాశమే లేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కనీసం నాలుగైదు నెలలపాటు పూర్తిస్థాయిలో దృష్టి పెడితే తప్ప కులగణన వ్య వహారం ఒక కొలిక్కిరాదని అధికారులు భావిస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో లెక్కలన్నీ తీయాల్సి ఉంటుంది. బీసీ కమిషన్ ఇచ్చే నివేదికను ప్రాతిపదికగా తీసుకొని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారా? లేక కొత్తగా కమిషన్ ఏర్పాటు చేస్తారా? ఉన్న కమిషన్కే బాధ్యతలు అప్పగిస్తారా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ‘డెడికేటెడ్ కమిషన్’ ఇచ్చే నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి కో ర్టుకు సమర్పించాల్సి ఉం టుంది. ఆ నివేదికపై సుప్రీంకోర్టు సం తృప్తి చెందితేనే, కోర్టు అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే మరింత సమయం పట్టే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కనీసం వచ్చే దసరా వరకు రిజర్వేషన్లు కొలిక్కి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. రిజర్వేషన్లు కొలిక్కి వచ్చిన తరువాత కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
గ్రామ పంచాయతీలను వార్డులవారీగా విభజించాలి. కొత్త ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేయడం, పునర్విభజన చేయడం వాటి ఆధారంగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తయారుచేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాలను నిర్ధారించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఏ పంచాయతీ, ఏ సామాజికవర్గానికి రిజర్వ్ అయిందో తేల్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. దీని కోసం కింది స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సులు లేదా ఈవీఎంలను సిద్ధంచేయాలి. ఈ ప్రక్రియలన్నింటినీ జూన్లోగా పూర్తి చేయడం అసాధ్యమని విశ్లేషకులు చెప్తున్నారు.
రాష్ట్రంలోని అనేక గ్రామాల ప్రజలు తమ గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడం, మున్సిపల్ కార్పొరేషన్ల సమీప గ్రామాలను ఆయా కార్పొరేషన్లలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉ న్నాయి. వీటన్నింటికీ చట్ట సవరణ అవసరం. ఇందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టడమో లేదా ఆర్డినెన్స్ ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 24% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోతోపాటు బీసీ, ఎస్సీ డిక్లరేషన్లలో రిజర్వేషన్ల శాతా న్ని వారి జనాభా ప్రాతిపదిక పెంచుతామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు 18%, బీసీలకు 42% ప్రాతిని ధ్యం కల్పిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు గత ఎన్నికల సమయంలో పేర్కొన్న ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలులేదు. కాంగ్రెస్ హా మీ అమలు కావాలంటే తమిళనాడు తరహాలో పార్లమెంట్ ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల శాతా న్ని చేర్చాల్సి ఉంటుంది. అలా అయితేనే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధం గా రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది.