వారంతా గొప్ప చదువులు చదివినోళ్లే. డిగ్రీ పట్టాలు అందుకొన్నారు. కానీ, చిన్నతనం నుంచి చూస్తున్న పొలాల్లోనే తమ ఉజ్వల భవిష్యత్తును వెతుక్కొన్నారు. ఆలోచనలకు ఆధునికతను జోడిస్తూ, సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఉపాధి అంటే ఉద్యోగమే కాదు.. వ్యవసాయం కూడా అంటూ ‘సాగు’తున్నారు.
నర్సింహులపేట, డిసెంబర్ 20: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలువురు విద్యావంతులు విభిన్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత కాళ్లపైనే నిల్చుంటున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న విభిన్న పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చేసే వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉండాలో నిరూపిస్తున్నారు. సేంద్రియ పద్ధతులు పాటిస్తూ, నేలతల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. వీరి ఓటు కూరగాయల సాగుకే. సంప్రదాయ వరి, మక్కజొన్న, పత్తి కంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇచ్చే కూరగాయల సాగే సూపర్ అంటున్నారు. టమాట, ఉల్లి, మిర్చి, కాకర, బీర, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనాతోపాటు పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఉద్యానవన అధికారి రాకేశ్ ప్రోత్సాహంతోనే తాము వ్యవసాయం వైపు మళ్లినట్టు యువరైతులు బానోతు వీరన్న(బీఏ,బీఈడీ), కోనేటి లక్ష్మయ్య(ఎంఏ-తెలుగు), బానోతు భద్రు(ఎంఏ-ఇంగ్లిష్), బానోతు అనిత(బీఏ), గుగులోతు శ్రీను తెలిపారు.
వ్యవసాయంతో స్వయం ఉపాధి
పదేండ్ల కిందట డిగ్రీ పూర్తి చేశా. కేయూలో ఎంఏ-తెలుగు చదివా. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడినా లాభం లేకపోయింది. దీంతో వ్యవసాయం చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నా. నాకున్న నాలుగెకరాల్లో పసుపు, కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నా.
గతేడాది 4.5 లక్షల ఆదాయం
ఐదేండ్ల కిందట ఎంఏ-ఇంగ్లిష్ పూర్తిచేశా. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే, నాకున్న భూమిలో విభిన్న రకాల పంటలు సాగు చేస్తున్నా. బీర, కాకర లాంటి కూరగాయలు పండిస్తున్నా. గతేడాది ఎకరం పొలంలో అన్ని ఖర్చులు పోగా రూ.4.5 లక్షల ఆదాయం వచ్చింది. నా భార్య అనిత కూడా బీఏ టీటీసీ చేసింది. ఆమె కూడా పొలం పనికి వస్తున్నది.