హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో సుమారు కోటి టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో వ్యవసాయ, పౌరసరఫరాలు, పోలీస్, మారెటింగ్ శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకున్నదని, అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లతో సహా అన్నీ సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కాగా 1.41 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా ఉండేందుకు సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మిల్లర్లతో రైతులకు ఇబ్బంది ఉండొద్దు
కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి గంగుల ఆదేశించారు. ధాన్యం మిల్లుకు వెళ్లిన తర్వాత ఎలాంటి కోతలు ఉండొద్దని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.