హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుతుండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను భారీ సబ్సిడీలతో ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్ లోన్పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతంవరకు (రెండు కోట్లకు మించకుండా) రీయింబర్స్మెంట్. మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడేండ్ల వరకు 100 శాతం రీయింబర్స్. ప్రతి యూనిట్కు రెండు రూపాయల చొప్పున ఐదేండ్లపాటు కరెంటుపై సబ్సిడీ’ ఇవ్వాలని క్యాబినెట్ నిర్దేశించింది. గ్రామీణ పారిశ్రామికీకరణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండేండ్లలో (2024-25) పదివేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నది. తొలిదశలో 10 జోన్లు నెలకొల్పాలని, ఒక్కో ఫుడ్ప్రాసెసింగ్ జోన్ విస్తీర్ణం కనీసం 500 నుంచి వెయ్యి ఎకరాల వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి ఆమోదం తెలిపింది.
పాలసీ మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించింది. వ్యవసాయ రంగంలో సాంకేతికతను, నైపుణ్యాన్ని పెంచేదిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలుపరచాలని సూచించింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు , పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్జోన్గా గుర్తించి జనావాసాలను, నిర్మాణాలను అనుమతించవద్దని నిర్ణయించింది. నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, పాడి, మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు అవసరమైన సామర్థ్యం రాష్ట్రంలో ఉన్నదని క్యాబినెట్ నిర్ధారించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ జోన్ల ద్వారా ప్రత్యక్షంగా 70 వేల మందికి, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుద్వారా గ్రామీణ పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతుందని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ జోన్ల ఏర్పాటుతో ఆర్థిక కార్యకలాపాలు, తద్వారా ఉపాధి పెరిగి మారుమూల ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని క్యాబినెట్ ఆశాభావం వ్యక్తంచేసింది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఔత్సాహిక యువతకు వీలైనన్ని ప్రోత్సాహకాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆయా జోన్లలో అన్ని మౌలికవసతులను ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు జోన్లో భూమి కేటాయించనుంది. విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీకి సంబంధించిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని తీర్మానించింది. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు జోన్లలో సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహం అందించనుంది. ఫుడ్ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా వాల్యూ చైన్ ముందుకు సాగడానికి ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ఎఫ్పీవోలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని నిర్ణయించింది.