హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచవారసత్వ హోదా మరికొద్దిరోజుల్లోనే వచ్చే అవకాశం ఉన్నదని పర్యాటక, శాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామప్పకు వారసత్వ హోదా వస్తే పర్యాటకంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక్క రోజులోనే పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పర్యాటకశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పీవీ పాపారావు పాల్గొన్నారు.