Telangana | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరుసగా టీఎస్పీఎస్సీ, గురుకుల, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన తుది ఫలితాలు వరుసగా విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు రెండుమూడు ఉద్యోగాలకు ఎంపికైనా ఒక్కదాన్నే ఎంపిక చేసుకోవాల్సి వస్తున్నది. మిగతా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఇలాంటి ‘నాన్జాయినింగ్ పోస్టుల’ను ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో అవన్నీ బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోతున్నాయి. ఇలా ఒక్కో నోటిఫికేషన్లో కనీసం10 శాతం ‘నాన్ జాయినింగ్ పోస్టులు’ ఉంటాయని అంచనా.
ఫలితాల వెల్లడిలో ప్రణాళిక లోపం..
సాధారణంగా ఒక అభ్యర్థి అర్హత ఉన్న నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసి, పరీక్ష రాస్తుంటాడు. ఒకేసారి రెండుమూడు పోస్టులకు ఫలితాలు వస్తే మంచి జీతం, హోదా ఉన్న ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటాడు. కాబట్టి ఉద్యోగాల స్థాయిని బట్టి అవరోహణ క్రమంలో ఫలితాలు విడుదల చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ ప్రభుత్వం భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకోవాలన్న హడావుడిలో సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నది.
ఉదాహరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లు (డీఎల్), జూనియర్ లెక్చరర్లు (జేఎల్), పీజీటీ, టీజీటీ పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తున్నది. ముందుగా 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, 1:1 నిష్పత్తిలో తుది ఫలితాలు విడుదల చేస్తున్నారు. ముందుగా డీఎల్ పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుదిఫలితాలు వెల్లడించి, తర్వాత వరుసగా జేఎల్, పీజీటీ, టీజీటీలకు కనీసం వారం రోజుల వ్యవధితో నియామకాలు పూర్తిచేస్తే అభ్యర్థులు పెద్ద ఉద్యోగాలవైపు మొగ్గు చూపేవారు..
తర్వాతి స్థాయి ఉద్యోగాల్లో ‘నాన్జాయినింగ్’ సమస్య ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ముందుగా పీజీటీ తుదిఫలితాలు ఇచ్చిన తర్వాత, డీఎల్, జేఎల్కు 1:2 నిష్పత్తితో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచింది. తుదిఫలితాలు విడుదల చేయకముందే టీజీటీ సర్టిఫికేషన్ నిర్వహించింది. అది పూర్తికాగానే డీఎల్, జేఎల్ తుది ఫలితాలు వెల్లడించింది. దీంతో టీజీటీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు వచ్చిన పదుల మంది అభ్యర్థులకు డీఎల్, జేఎల్లో అవకాశం వచ్చింది. దీంతో టీజీటీ తుదిఫలితాల్లో వాళ్ల పేర్లు ఉన్నా చేరని పరిస్థితి. అలాకాకుండా ప్రభుత్వం ముందుగానే డీఎల్, జేఎల్ తుది ఫలితాలు వెల్లడించి ఉంటే వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాకపోయేవారని, ఇతర అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేవని చెప్తున్నారు.
మరో మెరిట్ అభ్యర్థికి ఇవ్వాల్సిందే..
నాన్జాయినింగ్ పోస్టులు బ్యాక్లాగ్లో పడితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే వరకు నిరుద్యోగులు ఎదురుచూడాల్సి వస్తుందని చెప్తున్నారు. కటాఫ్ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బీఎస్పీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇప్పటికే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం స్పందిస్తే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి, తుది ఫలితాల్లో పేరురాని ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుందని సూచిస్తున్నారు.