హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంలో భాగంగా తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ.500లకే వంటగ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తీరా అమలు సమయంలో అనేక షరతులు విధిస్తున్నది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు మూడు ప్రధాన షరతులు విధించింది. ఈ మేరకు పథకం అమలు విధి విధానాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల్లోనూ పలు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొన్నది.
రూ.500లకే గ్యాస్ పథకాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం 40 లక్షల మంది వినియోగదారులకే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రులు మాత్రం తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ సంఖ్యను 40 లక్షలకే పరిమితం చేయడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్కార్డులున్నాయి. 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్కార్డుతోపాటు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారి వివరాలను ఇటీవల పౌరసరఫరాల సంస్థ లెక్కతీసింది. ఈ రెండు ఉన్నవారు సుమారు 65 లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. ప్రభుత్వం 40 లక్షల మందికి మాత్రమే సబ్సిడీ గ్యాస్ ఇచ్చి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన 25 లక్షల మంది పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ 40 లక్షల మంది అర్హులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేసింది? 25 లక్షల మందిని ఎందుకు ఎంపిక చేయలేదనేదానిపైనా స్పష్టత కరువైంది. అయితే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ మాత్రం ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హుల జాబితాలో పేరులేనివారు ఎమ్మార్వో వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సబ్సిడీ గ్యాస్ పథకంలో భాగంగా గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులు ముందుగా మొత్తం డబ్బును కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే.. అవి వినియోగదారులకు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాయి. అంటే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులు రూ.955 చెల్లించాల్సిందే. ఆ తర్వాత సబ్సిడీ రూ.455 వినియోగదారుల ఖాతాలో జమవుతాయి. అయితే ఈ సబ్సిడీ డబ్బు ఎప్పుడు జమవుతుందనేదానిపై కూడా స్పష్టత లేదు.
సబ్సిడీ గ్యాస్ పొందాలంటే సదరు లబ్ధిదారు ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో సబ్సిడీ గ్యాస్ పథకానికి కచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఉండాలి.
దరఖాస్తుదారులకు కచ్చితంగా తెల్ల రేషన్కార్డు ఉండాలి.
దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
ఈ పథకంలో ఇచ్చే సిలిండర్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. గత మూడేండ్లుగా సదరు వ్యక్తి వినియోగించిన (బుక్ చేసిన) గ్యాస్ సిలిండర్ల సంఖ్య సగటును లెక్కించి దాని ఆధారంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తారు.